జెన్-జీ ఆందోళనకారులకు కేసుల ఊరట.
ఆర్టికల్ 142తో కీలక తీర్పు.
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన జెన్ జీ విద్యార్థుల నిరసనలకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు సంచలన నిర్ణయంతో కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ కేసులను మూసివేయాలని నిర్ణయించిన ధర్మాసనం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ‘సంపూర్ణ న్యాయం’ కోసం ప్రత్యేక అధికారాలను వినియోగించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. ఈ ఎఫ్ఐఆర్లపై ఇక దర్యాప్తు కొనసాగించకూడదని, వాటిని అన్ని విధాలుగా మూసివేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన సీజేపీ నేతృత్వ నిరసనలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు తేల్చింది. జూలై 20 నుంచి 25 వరకు జరిగిన ఆందోళనలకు సంబంధించి కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా కేంద్రం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.
2,873 మందికి మాత్రం మినహాయింపు
అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నట్లు గుర్తించిన 2,873 మందిపై కొత్తగా ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జంతర్మంతర్ వద్ద నిరసన సమయంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే కేసులు నమోదు చేసినా వారి హక్కులకు భంగం కలగకూడదని, తమ వాదన వినిపించుకునే పూర్తి అవకాశం కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ తర్వాత ఆందోళనలకు దిగిన విద్యార్థులపై జూలై 20న పోలీసులు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ఉపయోగించడంతో వివాదం ముదిరింది. నిరసనకారులపై అల్లర్లు, హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. అనంతరం ఢిల్లీ పోలీసుల వైఖరిలో మార్పు వచ్చింది. సెప్టెంబర్ 5న సీజేపీ నిర్వహించనున్న మార్చ్ నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్లను కొనసాగించబోమని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర, అసోం, బిహార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరాయి.
విద్యార్థుల భవిష్యత్తుపై కోర్టు దృష్టి
ఈ తీర్పులో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న యువత భవిష్యత్ అవకాశాలకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతోనే ఆర్టికల్ 142ను వినియోగించినట్లు సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో తమ కెరీర్పై దృష్టి పెట్టాలని సూచించారు. నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించారు. పరిహారం చెల్లింపులు మూడు నెలల్లో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. తీర్పు అనంతరం CJP నేత సౌరవ్ దాస్ సెప్టెంబర్ 5న తలపెట్టిన మార్చ్ను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన హామీలకు సుప్రీంకోర్టు న్యాయబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
#SupremeCourt #NEETUG2026 #NEETPaperLeak #GenZProtests #StudentProtests #Article142 #NEETProtest #CJP #DelhiPolice #SupremeCourtVerdict #EducationNews #IndiaNews











