జమ్మలమడుగులో వైసీపీ నేతల అరెస్టు
జిందాల్ స్టీల్ ప్లాంట్ పర్యటనకు బ్రేక్
జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వైసీపీ నేతలను జమ్మలమడుగులో వైయస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఈ పర్యటనకు అనుమతి లేదని చెప్తూ వారిని ముందుకు సాగనివ్వలేదు. పోలీసుల చర్యపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు.











