కాలుష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.
గోదావరి జలాలను కలుషితం చేస్తూ, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న పరిశ్రమలపై ఇక కఠిన చర్యలు తప్పవని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమండ్రి సమీపంలో గోదావరి కాలుష్యానికి ఆంధ్రా పేపర్ మిల్స్ ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. పన్నులు చెల్లించి పుష్కరకాలం దాటిందని, బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశించినా కోర్టులను ఆశ్రయిస్తూ జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పును సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, నోటీసులు జారీ చేసి మూడు నెలల సమయం ఇచ్చినా యాజమాన్యం నుంచి కనీస స్పందన లేదని పవన్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, గోదావరి పరిరక్షణ విషయంలో బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు.
పరిశ్రమల వ్యర్థాలపై ప్రత్యేక నిఘా
పర్యావరణ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నది పరివాహక ప్రాంతంలోని పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థజలాలపై స్వయంగా పరిశీలన చేపట్టి, అవి నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ చర్యలను ఆలస్యం చేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా పేపర్ మిల్స్పై ఇక ఉపేక్ష ఉండదని పవన్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నుల బకాయిలు చెల్లించడం, కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేస్తూ, అవసరమైతే కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
#PawanKalyan #AndhraPaperMills #GodavariPollution #Rajahmundry #AndhraPradesh #EnvironmentMinister #IndustrialPollution #GodavariRiver #PollutionControl #APGovernment #APPolitics #EnvironmentalProtection #RiverPollution #IndiaNews #BreakingNews











