కేరళలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్.
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కేరళ పర్యటనలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చారు. శుక్రవారం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన.. శ్రీ మాతా అమృతానందమయి దేవిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆశ్రమంలో గడిపిన లోకేశ్.. ప్రాంగణంలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశ్రమంలోని గజరాజులకు పండ్లు అందించారు. ఈ పర్యటన తనకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చిందని లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని, ఎలాంటి అధికారిక కార్యక్రమం కాదని తెలుస్తోంది. రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో కొంత సమయం గడిపిన ఆయన.. ఆశ్రమంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.
విద్యాసంస్థలపై ప్రత్యేకంగా ఆరా
ఆధ్యాత్మిక పర్యటనతో పాటు ఏపీ విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ అక్కడి విద్యాసంస్థలను కూడా పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమృత విశ్వ విద్యాపీఠం, అమృత ఆయుర్వేద కళాశాలను ఆయన సందర్శించారు. విద్యాబోధన విధానం, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న వసతులపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆధునిక విద్యతో పాటు సంప్రదాయ వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని పరిశీలించారు. కేరళలోని ప్రముఖ విద్యా సంస్థలను ప్రత్యక్షంగా చూడటం ద్వారా అక్కడి విధానాలపై అవగాహన పొందారు. మరోవైపు అమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు విద్యా వ్యవస్థను పరిశీలించిన ఈ పర్యటన రాజకీయ కార్యక్రమాలకు దూరంగా సాగడం విశేషంగా నిలిచింది.
#NaraLokesh #AmritapuriAshram #MataAmritanandamayi #KeralaVisit #AmritaVishwaVidyapeetham #AmritaAyurvedaCollege #APEducationMinister #SpiritualVisit #KeralaEducation #AndhraPradesh











