ఆయుర్వేద ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పేరు తెచ్చుకున్న పతంజలి ఆయుర్వేద్ ఇప్పుడు బీమా రంగంలోకి అడుగుపెడుతోంది. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేసేందుకు భారత బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతి ఇచ్చింది. దీంతో పతంజలి సాధారణ బీమా మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.
రూ.4,500 కోట్ల భారీ ఒప్పందం
దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో పతంజలి ఆయుర్వేద్ 73.56 శాతం వాటా కొనుగోలు చేయనుంది. డీఎస్ గ్రూప్ 24.5 శాతం వాటా దక్కించుకోనుంది. ప్రస్తుతం ఆదార్ పూనావాలా గ్రూప్కు చెందిన సనోటి ప్రాపర్టీస్ ఎల్ఎల్పీ ఆధ్వర్యంలోని వాటాదారుల నుంచి దాదాపు 98 శాతం వాటాను ఈ రెండు సంస్థలు స్వాధీనం చేసుకోనున్నాయి. ఇప్పటివరకు పతంజలి ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులకే పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఆర్థిక సేవల రంగంలోకి అడుగుపెడుతోంది. కొత్తగా బీమా లైసెన్స్ కోసం దరఖాస్తు చేయకుండా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించింది.
మాగ్మా బలమైన నెట్వర్క్
మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ మోటార్, ఆరోగ్యం, ఆస్తి, వాణిజ్య బీమా విభాగాల్లో సేవలు అందిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3,615.48 కోట్ల స్థూల ప్రీమియంలను నమోదు చేసింది. వేలాది ఏజెంట్లు, కార్పొరేట్ భాగస్వాములు, ఆర్థిక సంస్థలు, ఆటోమొబైల్ కంపెనీలతో విస్తృత పంపిణీ వ్యవస్థను కలిగి ఉంది. పతంజలి దేశవ్యాప్తంగా ఉన్న తన పంపిణీ వ్యవస్థను ఉపయోగించి గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో బీమా సేవలను విస్తరించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐఆర్డీఏఐ ఇచ్చిన అనుమతి మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోగా కొనుగోలు ప్రక్రియ పూర్తైతే భారత సాధారణ బీమా రంగంలో పతంజలి కొత్త సంస్థగా చేరనుంది.
#Patanjali #PatanjaliAyurved #Insurance #InsuranceSector #IRDAI #MagmaGeneralInsurance #PatanjaliInsurance #InsuranceMarket #GeneralInsurance #InsuranceNews #PatanjaliMagmaDeal #AdarPoonawalla #DSGroup #FinancialServices #IndianInsurance #BusinessNews #CorporateNews #IndiaBusiness











