కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. కేవలం 15 నిమిషాలు సమయం కేటాయిస్తే తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో నిర్ధారించుకోవచ్చని చెప్పారు. అలసత్వం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న బీఎల్ఏలు, బీఎల్ఓలను తప్పనిసరిగా సంప్రదించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు వివరాలను ధృవీకరించుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిరక్షించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.










