Home National_news ఆప్ వర్సెస్ బీజేపీ పంజాబ్‌లో పరీక్షల రాజకీయాలు

ఆప్ వర్సెస్ బీజేపీ పంజాబ్‌లో పరీక్షల రాజకీయాలు


విద్యా మంత్రి రాజీనామా డిమాండ్!
బీజేపీకి పంజాబ్ సీఎం వార్నింగ్ .
బండారం మొత్తం బయటపెడ్తా.
పేపర్ లీక్ ఆరోపణల కలకలం.

కేంద్ర మాజీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. భారతీయ జనతా పార్టీ పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారిపై ఒకే ప్రమాణం ఉండాలని బీజేపీ పేర్కొంది. కేంద్రంలో రాజీనామా జరిగితే పంజాబ్‌లో కూడా అదే నైతిక బాధ్యత వర్తించాలని ప్రశ్నిస్తోంది. కాక్రోచ్ నేతలతో కీలక చర్చలు జరిపిన జేపీ నడ్డా ఇప్పుడు పంజాబ్‌పై ఫోకస్ పెట్టే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయ్.

బీజేపీ తీవ్ర ఆరోపణలు

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ పంజాబ్‌లో గత కొన్నేళ్లుగా అనేక పరీక్షల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష, పంజాబ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయని పేర్కొన్నారు. పంజాబ్ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు నియామకాలు, గ్రూప్-బీ పరీక్షల్లో కూడా అక్రమాలు జరిగాయని విమర్శించారు. నాయబ్ తహసీల్దార్, ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్షల్లో బ్లూటూత్ పరికరాలతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

కాంగ్రెస్ కూడా అదే స్వరం

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లలో ఆరు ప్రధాన పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆరోపించారు. విద్యార్థుల కలలు ఛిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యత స్వీకరించలేదని అన్నారు. విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

భగవంత్ మాన్ ఘాటు సమాధానం

ఈ ఆరోపణలను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పూర్తిగా ఖండించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాలేదని స్పష్టం చేశారు. ఐతే రెండు పరీక్షా కేంద్రాల్లో ఫేక్ ప్రచారం నిజమేనని అంగీకరించారు. అయితే వాటిని పది నిమిషాల్లోనే గుర్తించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. దుష్ప్రచారం చేసే ముఠాలపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా పంజాబ్‌లో పేపర్ లీక్ జరగదని హామీ ఇచ్చారు.

ఆప్ ప్రతివాదం

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు బల్తేజ్ పన్ను కూడా బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు. కొన్ని పరీక్షల్లో అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షలు రాసేందుకు ప్రయత్నించిన విషయం నిజమేనని చెప్పారు. అయితే దానిని ప్రశ్నాపత్రాల లీక్‌గా చిత్రీకరించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని విమర్శించారు. గతంలో కేంద్రంలోని బీజేపీ పాలనలో 90కు పైగా పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ, ఇప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

రాజకీయంగా మారిన పరీక్షల వివాదం

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ అంశంగా మారిన వేళ, ఇప్పుడు పంజాబ్‌లో కూడా అదే అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతుండగా, మరోవైపు ఆప్ ప్రభుత్వం పేపర్ లీక్ జరగలేదని స్పష్టంగా చెబుతోంది. ఈ ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయతపై చర్చ మరింత వేడెక్కుతోంది.

 

#Punjab #AAP #BJP #PunjabPolitics #PaperLeak #ExamControversy #HarjotSinghBains #BhagwantMann #EducationMinister #Congress #StudentIssues #NEET #IndiaNews #Politics #Exams