ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన బాలుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. శనివారం హనుమకొండ హనుమాన్ నగర్లోని బాలుడి నివాసానికి ఆయన స్వయంగా వెళ్లారు. నిరంజన్ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్ను నిరంజన్ తల్లిదండ్రులకు బండ్ల గణేష్ అందజేశారు. దైవసమానులైన పవన్ కల్యాణ్ పరామర్శ వల్లే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ భక్తుడిగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ సాయం చేసినట్లు పేర్కొన్నారు. నారా భువనేశ్వరి పుట్టినరోజున ఈ సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, నిరంజన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.











