ప్రవర్తనపై మాజీ అంపైర్ అసంతృప్తి
భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడితో మైదానంలోనే ఘర్షణకు దిగాడు. సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయిన అనంతరం ప్రత్యర్థి జట్టు బౌలర్తో మాటల యుద్ధం చేస్తూ, అడ్డువచ్చిన మరో ఆటగాడిని భౌతికంగా నెట్టివేసినట్లు వీడియోల ద్వారా స్పష్టమైంది. కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నంత మాత్రాన మైదానంలో ఎలాంటి ప్రవర్తనకైనా మినహాయింపు లభించదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై మాజీ అంపైర్ అనిల్ చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆటగాళ్లు భౌతికంగా గొడవ పడటం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, అంపైర్లు దీనిని ముందే నియంత్రించాల్సిందని పేర్కొన్నారు.
నిబంధనల ఉల్లంఘనపై జరిమానా ముప్పు
ఈ భౌతిక ఘర్షణను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 కింద తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశన్ అంపైర్ల నివేదిక, వీడియో ఆధారాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఘటన తీవ్రతను బట్టి వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా పడే అవకాశం ఉంది. దీనితో పాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించవచ్చు. ఒకవేళ ఘర్షణ తీవ్రత తక్కువగా ఉంటే అధికారిక హెచ్చరికతో వదిలేసే చాన్స్ కూడా ఉంది. 12 నెలల వ్యవధిలో నాలుగు డీమెరిట్ పాయింట్లు దాటితే సదరు ఆటగాడిపై మ్యాచ్ల నిషేధం విధిస్తారు.











