Home AP గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ:కాటన్ బ్యారేజ్ కొత్త గేట్ల పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ:కాటన్ బ్యారేజ్ కొత్త గేట్ల పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

18
Chief Minister inaugurates works for installing 117 new gates at Dowleswaram barrage

గోదావరి డెల్టా ప్రాంతానికి శాశ్వత రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా చారిత్రాత్మక సర్ ఆర్థర్ కాటన్ (ధవళేశ్వరం) బ్యారేజ్ వద్ద రూ. 152.95 కోట్ల అంచనా వ్యయంతో 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆయన సోమవారం అధికారికంగా ప్రారంభించారు. బ్యారేజ్ వద్ద నీటి ఉధృతిని పరిశీలించిన సీఎం, పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి, అంటే గోదావరి పుష్కరాల కంటే ముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బ్యారేజ్ నుండి 27,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతుండగా, కాలువల ద్వారా 14,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. సాగునీరు చివరి ఆయకట్టు భూముల వరకు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట – గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంకలో రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే గోదావరి డెల్టాను దేశానికే ‘అన్నపూర్ణ’గా మార్చిందని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజ్ వల్ల మరో అదనపు పంటకు నీరందుతోందని గుర్తుచేశారు. ఐదు దశాబ్దాలు దాటడంతో బ్యారేజ్ గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాడైపోయాయని, అందుకే ఆధునీకరణ అత్యవసరమైందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం (2014-19) రూ. 32 కోట్లతో కొన్ని గేట్లను మార్చగా, మిగిలిన 117 గేట్లను ఈ 9 నెలల్లో మార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసిందని, గేట్లకు గ్రీజు పెట్టడానికి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలోనే సాగునీటి రంగానికి రూ. 24,000 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టులోనూ కొత్త గేట్లను అమర్చామని తెలిపారు. కోనసీమ రైతులు గతంలో పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించిన పరిస్థితుల నుండి, నేడు ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Chief Minister inaugurates works for installing 117 new gates at Dowleswaram barrage

త్వరలోనే పోలవరం జాతికి అంకితం – నిర్వాసితులకు పూర్తి న్యాయం

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని సీఎం ధ్వజమెత్తారు. 2014-19 మధ్య తాము 72 శాతం పనులు పూర్తి చేస్తే, ఆ తర్వాత ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులే జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పరుగులు పెడుతున్నాయని, ప్రస్తుతం మొత్తం పురోగతి 89 శాతానికి చేరిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం విషయాల్లో ఎలాంటి రాజీ పడకుండా పూర్తి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా, రాయలసీమలకు తరలించి ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేశామని, దీనివల్ల రాయలసీమలో కియా కార్ల పరిశ్రమ వంటి పెట్టుబడులు సాధ్యమయ్యాయని వివరించారు. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతున్నందున రైతులు శాస్త్రీయ పంటల ప్రణాళికను అవలంబించాలని సూచించారు.

రూ. 1,200 కోట్లతో గోదావరి పుష్కరాలు – కోనసీమకు కొత్త ప్రాజెక్టులు

గోదావరి ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధికి అండగా నిలుస్తూ టీడీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారని సీఎం కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల విజయం అభివృద్ధికి ప్రజలిచ్చిన తీర్పన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, రాజమహేంద్రవరం, పుష్కర్ ఘాట్ల పరిసరాల్లో రూ. 1,200 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంకలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, కోనసీమకు రైల్వే లైన్ తెచ్చేందుకు కృషి చేస్తామని, కొవ్వూరులో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Chief Minister inaugurates works for installing 117 new gates at Dowleswaram barrage

హామీల అమలు – శాంతిభద్రతలపై ఉక్కుపాదం

ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తాము కలిసి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలలోనే ‘తల్లీ వందనం’ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని, సామాజిక భద్రత పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెప్పారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందిస్తూ… ఆయన త్వరగా ప్రజాసేవలోకి రావాలని తహతహలాడుతున్నప్పటికీ, పూర్తిగా కోలుకున్నాకే పనులు ప్రారంభించాలని తాను ముంబై వెళ్లినప్పుడు స్వయంగా సలహా ఇచ్చానని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై జీరో టాలరెన్స్ (ఉక్కుపాదం) విధానాన్ని అవలంబిస్తామని సీఎం హెచ్చరించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, క్యారెక్టర్ అస్సాసినేషన్, సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.