భారత క్రికెట్లో కీలక పరిణామానికి తెరలేచింది. బీసీసీఐ మాజీ స్టార్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్కు కొత్త పదవితో మరింత విస్తృత అధికారాలు దక్కనున్నాయి. జూనియర్ జట్ల పర్యవేక్షణ, ఆటగాళ్ల అభివృద్ధి, రిహాబిలిటేషన్, పురుషుల, మహిళల క్రికెట్ పాత్వేలను సమన్వయం చేయడంతో పాటు సిబ్బంది నియామకాలపైనా ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త హోదా సంస్థాగతంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కంటే లక్ష్మణ్ను పైస్థాయిలో నిలబెట్టనుంది. అయితే గంభీర్, అగార్కర్ల ప్రస్తుత బాధ్యతలకు తక్షణ ముప్పు లేదని, 2027 ప్రపంచకప్ వరకు వారు తమ పదవుల్లో కొనసాగనున్నట్లు సమాచారం. భారత క్రికెట్లో సీనియర్ జట్టు నుంచి జూనియర్ స్థాయి వరకు ఒకే దిశలో వ్యవస్థను నడిపించడమే లక్ష్మణ్ కొత్త పాత్ర లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే ఆ ఇద్దరినీ పొమ్మనకుండా పొగబెడుతున్నారన్నమాట.
గంభీర్, అగార్కర్కు బీసీసీఐ షాక్… ఇకపై ఆటగాళ్లపై పెత్తనం లక్ష్మణ్కే
Laxman Takes Charge











