“లక్షన్నర కోట్లు ఎక్కడ ఖర్చయ్యాయి?”
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 26 నెలల పాలనలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, దేశంలోనే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని అన్నారు. అయితే ఆ సంక్షేమం ప్రజలకు ఎక్కడ కనిపిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రచారంలో చెప్పే లెక్కలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు.

“అప్పుల్లోనే దేశంలో నంబర్ వన్”
సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు వేరే మాటలు మాట్లాడుతున్నారని రాచమల్లు విమర్శించారు. కేవలం 26 నెలల్లోనే రాష్ట్రంపై రూ.3.60 లక్షల కోట్ల అప్పు మోపారని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలు కంటే అప్పులు పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యకరమని, ఎన్నికల ముందు చెప్పిన హామీలకు ఇది పూర్తిగా విరుద్ధమని విమర్శించారు.

“జగన్ హయాంలో సంక్షేమం ఆగలేదు”
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలకు అందించారని రాచమల్లు గుర్తు చేశారు. క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లోనూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీదేనని అన్నారు. ప్రస్తుతం సంక్షేమం పేరుతో ప్రచారం ఎక్కువగా కనిపిస్తోందే తప్ప, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాల కంటే ప్రజల జీవితాల్లో కనిపించే మార్పులే అసలు సంక్షేమానికి కొలమానమని రాచమల్లు వ్యాఖ్యానించారు.











