బాబు పాలనపై జగన్ ప్రశ్నల వర్షం
కరువుపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని ఆరోపించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని, 688 మండలాల్లో 625 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత పంటలకు నీళ్లు అందిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసిందని జగన్ విమర్శించారు. రైతులు పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందడం లేదన్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మంత్రులు ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ ఆరోపించారు. 2023లో 1.18 కోట్ల ఉచిత పంటల బీమా దరఖాస్తులు రాగా, 2026-27లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. 2025 అక్టోబర్లో వచ్చిన మోంథా తుపాను నష్టాలకు కూడా రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదన్నారు.

శ్రీశైలం నీటిపై జగన్ ఆందోళన
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరిస్థితిపైనా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 11న నీటిమట్టం 880 అడుగులు ఉండగా, ప్రస్తుతం ఇన్ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. నీటిమట్టం 854 అడుగులకు పడిపోతే రాయలసీమకు నీరు అందించే అవకాశం ఉండదని చెప్పారు. అవకాశమున్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వలేదని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 180 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 55.56 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని జగన్ చెప్పారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణలో కొత్త ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాయలసీమ రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుపై ఆరోపణలు
బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం జీవో 176 ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. అయితే కోర్టు తీర్పుల కారణంగా ఆ రిజర్వేషన్లు కొనసాగలేదన్నారు. ఇప్పుడు అదే అంశంపై చంద్రబాబు రాజకీయ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లేది కూడా ఆయనే, రిజర్వేషన్లు అడ్డంకుల్లో పడటానికి కారణం కూడా ఆయనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ఐదేళ్ల పాలనలో బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేశామని జగన్ తెలిపారు. తమ కేబినెట్లో 25 మందిలో 11 మంది బీసీలేనని చెప్పారు. 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురిని బీసీలకు ఇచ్చామని, 25 లోక్సభ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవుల్లోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు.

బీసీ సంక్షేమానికి పలు చర్యలు తీసుకున్నాం
139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని జగన్ చెప్పారు. నామినేటెడ్ పదవులు, పనులు, కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం వాటా కల్పించామని తెలిపారు. మహిళలకు కూడా 50 శాతం వాటా ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి రూ.1.30 లక్షల కోట్లు పంపించామని వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీల రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు అక్రమ కేసులు పెడుతోందని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, చింతాడ రవికుమార్, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్పై నమోదైన కేసులను ప్రస్తావించారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తాను చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు చంద్రబాబు సహా ఎవరూ స్పందించలేదని జగన్ అన్నారు. రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, నీటి కొరత, బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.











