విజయానికి గీతా మార్గదర్శకం
ఫౌండేషన్కు అభినందనలు
తిరుపతి: విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, జీవిత లక్ష్యాలపై స్పష్టత పెంపొందించే ఉద్దేశంతో శ్రీవత్స వనమాలి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కంచి పీఠానికి చెందిన సంప్రదాయ పాఠశాలలో “గీతా సక్సెస్ మంత్రా” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) వైస్ ఛాన్సెలర్ డాక్టర్ అర్వీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త ఆకెళ్ళ విభీషణ శర్మ విద్యార్థులను ఉద్దేశించి భగవద్గీతలోని జీవన సూత్రాలను సులభంగా వివరించారు. భగవద్గీత కేవలం వృద్ధుల కోసం మాత్రమే అన్న అభిప్రాయం సరైంది కాదని, విద్యార్థి దశలోనే గీత బోధనలను ఆచరిస్తే వ్యక్తిత్వ వికాసంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని డాక్టర్ అర్వీ కుమార్ పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన సందేశం నేటి యువతకు కూడా సమానంగా వర్తిస్తుందని, క్రమశిక్షణ, ధైర్యం, కర్తవ్యనిర్వహణ వంటి విలువలను జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో సానుకూల ఆలోచనలు, విలువలతో కూడిన జీవన విధానాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. యువతకు ఉపయోగపడే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీవత్స వనమాలి సేవా ఫౌండేషన్ను పలువురు అభినందించారు.











