దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027కు కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. జనాభా లెక్కల కోసం పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేశారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టనున్న నేపథ్యంలో ప్రశ్నావళిలో 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీ, కుల వివరాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈసారి జనగణనను యాప్లు, డిజిటల్ సాధనాల ద్వారా నిర్వహించనున్నారు. పౌరులు 15 రోజుల వ్యవధిలో స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
రెండు దశల్లో భారీ ప్రక్రియ
రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో జనగణన–2027ను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఇళ్ల నమోదు, గృహ వసతుల వివరాల సేకరణ జరుగుతుంది. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కుల వివరాలను నమోదు చేస్తారు. పౌరులు అందించే వ్యక్తిగత సమాచారానికి చట్టపరమైన రహస్య రక్షణ కల్పించారు. సెన్సస్ యాక్ట్, 1948లోని సెక్షన్ 15 ప్రకారం ఈ వివరాలకు పూర్తి చట్టబద్ధ భద్రత ఉంటుంది.
#Census2027 #IndiaCensus #DigitalCensus #CasteCensus #PopulationCensus #SCST #CensusQuestionnaire #RegistrarGeneralOfIndia #CensusAct #India











