Home National_news ఢీ లిమిటేషన్స్.. మహిళా కోటాపై కొత్త వివాదం

ఢీ లిమిటేషన్స్.. మహిళా కోటాపై కొత్త వివాదం



విమెన్ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ కొత్త లాజిక్ .
డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై దుమారం.
కేంద్ర మంత్రి రిజిజుకు క్లారిటీ ఇచ్చిన రాహుల్ .

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు అంశం మరోసారి కేంద్ర రాజకీయాల్లో వేడి పెంచింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారని రాహుల్‌ ప్రశ్నించగా.. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా కోటా అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు.

2023 చట్టాన్ని అమలు చేయండి

రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు రాజకీయాల్లో స్వేచ్ఛ, సమాన ప్రాతినిధ్యం అవసరమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రిజిజు.. కాంగ్రెస్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కోరారు. రాహుల్‌ వెంటనే స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఇప్పటికే ఆ చట్టానికి మద్దతు ఇచ్చిందని చెప్పారు. మూడు సంవత్సరాలు గడిచినా చట్టం ఎందుకు అమల్లోకి రాలేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌తో అనవసరంగా ముడిపెట్టకుండా 2023 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

2029లో అమలు సాధ్యమేనా?

2023లో చేసిన రాజ్యాంగ 106వ సవరణ చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే నిబంధన ఉందని రిజిజు చెప్పారు. అయితే ఈ నిబంధనలు జనాభా లెక్కల ఆధారంగా జరిగే డీలిమిటేషన్‌ తర్వాతే అమల్లోకి వస్తాయని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలు, కుల గణనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం వంటి ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలంటే డీలిమిటేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుందని రిజిజు స్పష్టం చేశారు. ఆలస్యం అయితే మహిళా రిజర్వేషన్‌ 2034 ఎన్నికల వరకు వాయిదా పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అంటే మహిళా కోటా అమలు వేగం డీలిమిటేషన్‌ ప్రక్రియతో నేరుగా ముడిపడి ఉందన్నది కేంద్రం వాదన.

డీలిమిటేషన్‌ బిల్లుకు బ్రేక్

2026 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను 850 వరకు పెంచడం, అందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించడం వంటి ప్రతిపాదనలతో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. అయితే దీనికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. తాజా డీలిమిటేషన్‌ వల్ల జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నది వారి ప్రధాన అభ్యంతరం. అందుకే మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఉన్నా.. దానిని డీలిమిటేషన్‌తో కలిపి అమలు చేయడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

బిల్లు ఏమవుతుందో

భారత్‌ విజయవంతమైన దేశంగా ఎదగాలంటే మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలగాలని రాహుల్‌ గాంధీ అన్నారు. కుటుంబంలోనే కాకుండా సమాజంలోనూ మహిళలు ప్రశ్నించే హక్కును కలిగి ఉండాలని పేర్కొన్నారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్‌ను త్వరగా అమలు చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తుండగా.. మరోవైపు డీలిమిటేషన్‌ లేకుండా ఆ చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. గతంలో డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిలిచిన ప్రతిపక్షాలు ఇప్పుడు మహిళా కోటాపై తమ మద్దతును స్పష్టం చేస్తున్నాయి. దీంతో మహిళా రిజర్వేషన్‌ అమలుకు డీలిమిటేషన్‌ తప్పనిసరా? లేక చట్టాన్ని వేరుగా అమలు చేయవచ్చా? అన్న ప్రశ్న కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.

 

#WomenReservation #WomenQuota #WomenReservationBill #NariShaktiVandan #Delimitation #DelimitationDebate #RahulGandhi #KirenRijiju #Congress #BJP #WomenInPolitics #PoliticalRepresentation #33PercentReservation #ConstitutionalAmendment #106thAmendment #Census2027 #LokSabha #2029Elections #2034Elections #SouthIndia #IndianPolitics