రక్షా ఎక్స్పోకు రాజ్నాథ్కు ఆహ్వానం
డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిశారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరై.. అందులో భాగంగా నిర్వహించనున్న రక్షా ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్నాథ్సింగ్ను ఆహ్వానించారు. తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఈ సదస్సును వేదికగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఏరోస్పేస్ నుంచి డిఫెన్స్ వరకు
రక్షా ఎక్స్పోలో ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థల ప్రదర్శనతో పాటు ఎయిర్షో, పారిశ్రామిక ప్రదర్శన, భూఆధారిత రక్షణ వ్యవస్థల లైవ్ డెమోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమానికి రాజ్నాథ్సింగ్ హాజరు కావడం ప్రోత్సాహకరంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. రక్షా ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు రక్షణశాఖ సహకారం అందించాలని రేవంత్రెడ్డి కోరారు. ఎయిర్షోకు అవసరమైన ఎయిర్స్పేస్ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత వాయుసేనకు చెందిన విమానాలతో పాటు సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ డిస్ప్లేకు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
విదేశీ రక్షణ సంస్థలతో సమావేశాలు
ఎగ్జిబిషన్లో భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనకు చెందిన తాజా రక్షణ వ్యవస్థలను ప్రదర్శించాలని సీఎం కోరారు. మూడు దళాలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రతినిధులు ఎక్స్పోలో పాల్గొనేలా చూడాలని రాజ్నాథ్సింగ్ను కోరారు. హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలతో పాటు డీఆర్డీవో ప్రయోగశాలలు పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ రక్షణ రంగ ప్రతినిధులను కూడా హైదరాబాద్కు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. విదేశీ రక్షణ మంత్రిత్వశాఖల ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు రక్షణశాఖ సహకరించాలని సీఎం కోరారు. దీనివల్ల తెలంగాణలోని రక్షణ పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు 416.18 ఎకరాలు
ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన అంశాన్ని కూడా రేవంత్రెడ్డి రాజ్నాథ్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. రక్షణశాఖ మొత్తం 1,500 ఎకరాలు కోరిన నేపథ్యంలో మరో 750 ఎకరాలు కూడా సేకరించి అందించేందుకు సీఎం అంగీకరించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాలను కేటాయించేందుకు టీజీఐఐసీ అంగీకరించినట్లు సీఎం తెలిపారు. ఈ భూమిని 33 ఏళ్లకు ఏడాదికి కేవలం రూ.1 లీజు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ మొత్తం భూమికి రూ.1 చెల్లించేలా నిర్ణయించామని, అవసరమైతే మరో రెండు సార్లు లీజును పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు.
#Telangana #RevanthReddy #RajnathSingh #DefenceExpo2026 #InvestTelangana2026 #DefenceIndustry #Aerospace #DefenceInvestments #Hyderabad #DefenceTechnology #DRDO #DRDL #HAL #BEL #BDL #AdilabadAirport #FutureCity











