గత ప్రభుత్వ విధ్వంసక పాలనకు ముగింపు పలికి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేటలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు మహిళా కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాల్స్ను పరిశీలించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రజల పూర్తి విశ్వాసాన్ని సంపాదించిందన్నారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో లొల్ల లాకుల ఆధునికీకరణ, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, దేవరపల్లి ఎంఎస్ఎంఈ పార్కు, ఏనుగుమహల్ సబ్స్టేషన్ నిర్మాణం, బడుగువానిలంక వద్ద గోదావరి నదీ కోత నివారణ పనులతో పాటు 36 విలేజ్ హెల్త్ క్లినిక్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.










