ఓటు ఎక్కడో చెప్పాలి.. ప్రకాష్ రాజ్!
పోలీసు ప్రాణాలకు జవాబు చెప్పాలి.. ప్రభుత్వం!
ఓటుపై సంగప్ప ఫైర్
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప తీవ్రంగా తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్కు పలు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని, అసలు ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలో ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు. బెంగళూరు శాంతినగర్లోని చిరునామాలో ఆయన నాలుగేళ్లుగా నివసించడం లేదని బీఎల్వో విచారణలో తేలిందని చెప్పారు. ఓటు షిఫ్టింగ్ ప్రక్రియలో భాగంగానే తొలగింపు జరిగిందని వివరించారు. ప్రకాష్ రాజ్ తాను నివసిస్తున్న ప్రాంత చిరునామాతో ఫామ్–6 దరఖాస్తు చేస్తే ఓటు పొందవచ్చని సంగప్ప పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఓటు తొలగింపు అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

కానిస్టేబుల్ మృతిపై విచారణ
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని సంగప్ప డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరతతో తీవ్ర పని ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్లే పరిస్థితి విషమిస్తోందన్నారు. డీఏలు, టీఏలు, సరెండర్ లీవులు, అదనపు సెలవులు, ప్రమోషన్లు వంటి అంశాల్లో పోలీసు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగప్ప అన్నారు. సాయికుమార్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో సంగప్ప తోపాటు నామాని మహేష్ కుమార్, మన్మీత్ సింగ్ పాల్గొన్నారు.











