భద్రాద్రి జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా వచ్చే 20 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మణుగూరు ఓపెన్కాస్ట్ గనిని పరిశీలించిన ఆయన, బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త బొగ్గు బ్లాకులను వేలంలో సొంతం చేసుకోవాలని సింగరేణి అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బొగ్గు కొరత ఏర్పడిందని విమర్శించిన భట్టి, సింగరేణి ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.











