Home AP రెండు నిమిషాలు చాలు జగన్ & కో ని కంట్రోల్ చేసేస్తా రాజకీయ ముసుగులో...

రెండు నిమిషాలు చాలు జగన్ & కో ని కంట్రోల్ చేసేస్తా రాజకీయ ముసుగులో రౌడీయిజమా?


డీఎస్సీపై కావాలనే వైసీపీ నానా యాగీ.
పొగాకు రైతుల వద్దకు వెళ్లి హంగామా?
రైతుల పొలాలను ధ్వంసం చేసి క్షోభ!
అరాచకాలను ప్రజలకు వివరించండి.
కేబినేట్‌ భేటీలో మంత్రులతో చంద్రబాబు.

అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ & కో చేస్తున్న అరాచకాలను అదుపు చేయడానికి తనకు రెండు నిమిషాలు చాలని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నందున చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.

డీఎస్సీ వివాదంపై స్పందన

డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని సీఎం విమర్శించారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. కోర్టుల నుంచి కూడా వైసీపీ నేతలు చీవాట్లు తిన్నా వైఖరి మార్చుకోవడం లేదని అన్నారు.

రైతుల పంటల ధ్వంసంపై ఆగ్రహం

దేవరపల్లి పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రైతుల పొలాలను, పొగాకు బేళ్లను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడంతో పాటు దేవతల చిత్రాలను పగులగొట్టడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలపై అనేక మంది రైతులు తనకు సందేశాలు పంపి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్ పరామర్శలకే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం

ఈ నెలాఖరులో వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి ప్రకాశం జిల్లాకు తాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు తెచ్చిందని చెప్పారు. ఆక్వా రైతులకు రూ.1,100 కోట్ల విద్యుత్ రాయితీలు, పొగాకు రైతులకు అందిస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. స్వర్ణాంధ్ర, వికసిత భారత్ లక్ష్యాలను స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ప్రజలకు వివరించాలని ఆదేశించారు.

అగ్రిగోల్డ్, స్థానిక ఎన్నికలు

అగ్రిగోల్డ్ బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా కేబినెట్ ఉపసంఘం జాగ్రత్తగా పనిచేయాలని సీఎం సూచించారు. భూముల వేలంలో సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే మంత్రులు, కూటమి నేతలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 13న సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్నట్లు, విజయదశమి నాటికి మంత్రుల నివాస సముదాయాలు సిద్ధమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు.

 

#ChandrababuNaidu #YSJagan #YSRCP #AndhraPradesh #APCabinet #DSC #TobaccoFarmers #VelugondaProject #BhogapuramAirport #Agrigold #LocalBodyElections #APPolitics #TDP #PoliticalNews