Home Telangana మట్టిలో మాణిక్యాలు – ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ కాదు

మట్టిలో మాణిక్యాలు – ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ కాదు

41

ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం నామోషీ కాదని, ఆ భావన నుండి ప్రజలంతా బయటపడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ను బుధవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్కూల్‌ను సర్కార్ నిర్మించింది. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అందులోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, అత్యాధునిక లైబ్రరీ, ల్యాబ్స్, వంటగది, డైనింగ్ హాల్‌ను స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. మైదానంలో విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ బడుల ద్వారానే సమాజంలోని మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

అపోహల తొలగింపు విద్యా ప్రక్షాళన
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉద్యోగాలు రావనే అపోహలు పేద తల్లిదండ్రుల్లో ఉన్నాయని, వాటిని తొలగించడానికే ఈ మోడల్ స్కూల్‌ను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించామని చెప్పారు. దేశంలోని ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారేనని గుర్తుచేశారు. తాను కూడా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ఆరో తరగతి కోసం రోజుకు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడినని తన గతాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యా కమిషన్ దేశ విదేశాలలో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

కుల వ్యవస్థ నిర్మూలనకు స్కూళ్లు
గత ప్రభుత్వం వర్గానికొక స్కూల్ పెట్టి సమాజంలో కుల వ్యవస్థను ప్రోత్సహించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేరిట విడివిడిగా పాఠశాలలు పెట్టి పిల్లల మధ్య చిన్నప్పుడే కులాల గోడలు నిర్మించారని ఆరోపించారు. ఆ గోడలను కూల్చాలనే ఉద్దేశంతోనే కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తమ ప్రభుత్వం నిర్మిస్తోందని స్పష్టం చేశారు. విద్య అనేది ఖర్చు కాదని, అది సమాజ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని చెప్పారు. ఆరుట్ల పాఠశాలలో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని, సీట్లు భర్తీ అయిపోవడంతో అడ్మిషన్లు లేవనే బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.

క్రీడల ప్రోత్సాహం ఒలింపిక్స్ లక్ష్యం
చదువుతో పాటు క్రీడలకు కూడా తమ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. వంద నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు సాధించలేకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల తాను దక్షిణ కొరియా పర్యటనలో అక్కడి క్రీడా విధానాలను అధ్యయనం చేశానని, త్వరలోనే రాష్ట్రంలో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ప్రారంభిస్తామని ప్రకటించారు. 2034 నాటికి తెలంగాణ నుండి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారులను తయారుచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థంతో విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మెస్సీ డ్రగ్స్ ముఠా లీడర్ కాదని, ఆర్థిక నేరగాడు కాదని హితవు పలికారు.

27 లక్షల మంది విద్యార్థులకు విద్యా కిట్లు
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన యూనిఫామ్‌లు నెల రోజులకే చిరిగిపోయేవని, కానీ తమ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్లను అందిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ కోసం, 680 కోట్ల రూపాయలతో పారదర్శకంగా టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఇందులో రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కొందరు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ నెల 19న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ సమక్షంలో డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.