Home Telangana హైడ్రా రంగనాథ్‌కు ఊరట సింగిల్ జడ్జి ఆదేశాలకు బ్రేక్

హైడ్రా రంగనాథ్‌కు ఊరట సింగిల్ జడ్జి ఆదేశాలకు బ్రేక్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ కేసులో ఆయనపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. దీంతో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి మార్చాలన్న సింగిల్‌ జడ్జి ఆదేశాలకు ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. తదుపరి విచారణను నవంబర్‌ 3కి వాయిదా వేసిన కోర్టు, అప్పటి వరకు ఈ ఉత్తర్వులపై స్టే కొనసాగించేలా ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో లోతుకుంట భూముల విషయంలో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు హైడ్రా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రంగనాథ్‌ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయన తరఫున హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజీవ్‌ శక్దర్‌ వాదనలు వినిపించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్‌ కేసులో రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్‌ జడ్జి గతంలో ఆదేశించారు. ఈ నిర్ణయంపై రంగనాథ్‌ అప్పీల్‌ చేయడంతో డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. నవంబర్‌ 3న జరిగే తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

 

#HYDRA #Ranganath #HYDRACommissioner #TelanganaHighCourt #TelanganaHC #ShantaSriramConstruction #RanganathCase #HYDRACase #DivisionBench #LokuntakuntaLands #HyderabadNews #TelanganaNews #HighCourt