బొండా ఉమా కొత్త వ్యూహం మంత్రి పదవే అసలు లక్ష్యమా?

Bonda Uma Minister Post

మంత్రి పదవిపై గురి.. కాపు కార్డ్‌తో సరి..
బాబుపై ఒత్తిడి పెంచుతున్న బొండా ఉమా?
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చుట్టూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుతో ఒకే వేదిక పంచుకోవడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ కోరడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే బొండా ఉమా మాత్రం అది రాజకీయ కార్యక్రమం కాదని, మర్యాదపూర్వకంగా పలకరించానని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో తనను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో జక్కంపూడి రాజా కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కలిసి పాల్గొన్నప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ పరిణామాల వెనుక మంత్రి పదవి అంశమే ప్రధాన కారణమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మంత్రి పదవే లక్ష్యమా?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొలుసు పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడంపై బొండా ఉమా అసంతృప్తిగా ఉన్నారనే చర్చ బలపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం తాను తీవ్ర స్థాయిలో పోరాడానని, అయినా పార్టీ మారి వచ్చిన నాయకుడికి మంత్రి పదవి దక్కిందనే భావన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ తన రాజకీయ ప్రాధాన్యాన్ని పార్టీ అధిష్ఠానానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలో తన బలం ఏమిటో తెలియజేస్తూ భవిష్యత్ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకోవాలనే వ్యూహంతోనే బొండా ఉమా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విజయవాడ సెంట్రల్‌పై కొత్త చర్చ
ఈ వివాదంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రాజకీయాలు కూడా మళ్లీ చర్చకు వచ్చాయి. గత ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు పలు అవకాశాలు ఇచ్చినా, ఆయన విజయవాడ సెంట్రల్‌పైనే పట్టుబట్టడంతో చివరకు బొండా ఉమాకే పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు బొండా ఉమాపై వివరణ కోరిన పరిణామం తర్వాత ఆయన స్థానం గతంలా బలంగా లేదనే ప్రచారం మొదలైంది. దీంతో భవిష్యత్తులో విజయవాడ సెంట్రల్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందా, వంగవీటి రాధాకు అవకాశం కల్పిస్తారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై టీడీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ విశ్లేషణలు, పార్టీ అంతర్గత చర్చలుగానే కొనసాగుతున్నాయి.