Home AP ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్మికులకు భరోసా

ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్మికులకు భరోసా


జగన్‌ను కలిసిన యూనియన్‌ ప్రతినిధులు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) కాంట్రాక్ట్‌ కార్మికుల యూనియన్‌ ప్రతినిధులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా గత 26 ఏళ్లుగా సుమారు 7 వేల మంది కార్మికులు సమగ్ర మంచినీటి పథకాలలో పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు.

థర్డ్‌ పార్టీ విధానంపై ఆవేదన

థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానం కారణంగా అనేక జిల్లాల్లో నిర్ణీత ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం వేతనాలు అందడం లేదని యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 నెలల వరకు జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని వాపోయారు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని రద్దు చేసి పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

అండగా ఉంటామని జగన్‌ హామీ

కార్మికుల సమస్యలను పూర్తిగా విన్న వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, దేవినేని అవినాష్‌, మల్లాది విష్ణు, తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

 

#YSJagan #RWSWorkers #ContractWorkers #AndhraPradesh #YSRCP #PendingWages #RuralWaterSupply #WorkersIssues #APPolitics #Tadepalli