Home National_news టార్గెట్ హోం మినిస్టర్ పెల్లెట్ కేసుతో ప్రభుత్వానికి షాక్

టార్గెట్ హోం మినిస్టర్ పెల్లెట్ కేసుతో ప్రభుత్వానికి షాక్


ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఎటాక్.
ఎఫ్‌ఐఆర్‌తో అమిత్ షాకు కౌంటర్.
ఆరు గంటల పాటు రాహుల్ ధర్నా.

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూకుడు రాజకీయానికి తెరతీశారు. జూలై 20న జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనలో పెల్లెట్ గాయాలతో బాధపడుతున్న 19 ఏళ్ల సహిల్ లోచబ్‌కు న్యాయం చేయాలంటూ ఆయన శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆరు గంటలకు పైగా ధర్నాకు దిగారు. ముందుగా సహిల్‌తో కలిసి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అక్కడ స్పందన రాకపోవడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని డీసీపీని కలిశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యే వరకు కదిలేది లేదంటూ రాహుల్ అక్కడే బైఠాయించడం ఢిల్లీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చివరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో ధర్నాను విరమించారు.

ఎఫ్‌ఐఆర్‌తో కొత్త రాజకీయ అస్త్రం

పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 118(1) కింద కేసు నమోదు చేశారు. ప్రమాదకరమైన ఆయుధం లేదా మార్గం ద్వారా ఉద్దేశపూర్వకంగా గాయపరిచిన అంశానికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. సహిల్ ఫిర్యాదులో తన శరీరంలో 200కుపైగా పెల్లెట్లు ఉన్నాయని, కంటికి తీవ్ర గాయం కావడంతో చూపు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నాడు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే రాహుల్ దీనిని “న్యాయం వైపు మొదటి అడుగు”గా అభివర్ణించారు. నెల రోజులుగా బాధితుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదని ఆరోపించారు. మరోవైపు రాహుల్ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశ్నలు సంధించారు. పైస్థాయి అనుమతి వచ్చిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అసలు రాజకీయ పోరును అమిత్ షా వైపు మళ్లించాయి.

అమిత్ షాపై నేరుగా గురి

పెల్లెట్ గన్స్ వినియోగంపై అమిత్ షా వివరణ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పలేదని కూడా ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కేసు నమోదుతో పెల్లెట్ వినియోగంపై దర్యాప్తుకు అధికారిక మార్గం ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతోంది. అయితే బీజేపీ మాత్రం రాహుల్ ధర్నాను “అటెన్షన్ సీకింగ్ పాలిటిక్స్”గా అభివర్ణించింది. సుప్రీంకోర్టు ఇప్పటికే జూలై 20 ఘటనపై ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. అయినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. బాధితుడి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం ద్వారా రాజకీయంగా ఒక అడుగు ముందుకేశారు. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ దర్యాప్తు ఎటు వెళ్తుంది? పెల్లెట్ గన్స్ ఎవరి ఆదేశాలతో వాడారు? ఈ ప్రశ్నలే కేంద్ర ప్రభుత్వంపై కొత్త ఒత్తిడిగా మారే అవకాశం కనిపిస్తోంది.

 

#RahulGandhi #PelletCase #SahilLochab #AmitShah #Congress #BJP #DelhiPolitics #JantarMantar #FIR #PelletGuns #ParliamentStreet #IndianPolitics