రాజధాని నిర్మాణంలో మరో అడుగు.
అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. దీంతో అమరావతిలో శాసనసభ్యుల నివాస వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం మొత్తం 12 టవర్లతో నివాస సముదాయాన్ని నిర్మించారు. ఒక్కో ప్లాట్ సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, మొత్తం 288 ప్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది. అత్యాధునిక సదుపాయాలతో పాటు టవర్ల మధ్య ప్రత్యేక ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు.
భవనాలను పరిశీలించిన సీఎం
నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు, మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్తో కలిసి టవర్లను పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అనంతరం భవన సముదాయాన్ని సాధారణ పరిపాలన శాఖకు అధికారికంగా అప్పగించారు.
ఇక కేటాయింపులపై ప్రభుత్వం నిర్ణయం
భవనాల నిర్వహణ బాధ్యతలను ఇకపై సాధారణ పరిపాలన శాఖ చేపట్టనుంది. ప్రభుత్వం నిర్ణయించే విధానం ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాజధానిలో శాసనసభ్యుల నివాస సముదాయం అందుబాటులోకి రావడం అమరావతి నిర్మాణ పురోగతికి మరో సంకేతంగా నిలిచింది.
#Amaravati #MLATowers #MLC #MLCResidentialComplex #ChandrababuNaidu #Rayapudi #CRDA #AmaravatiCapital #AmaravatiDevelopment #CapitalConstruction #AndhraPradesh #APCapital #AmaravatiInfrastructure #APNews











