అక్కడ్నుంచే సీఎం పోటీ చేయాలి.
తల్లికి అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం.
కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి రేవంత్రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, ఆమెపై వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని ఆమె అన్నారు. “మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. రేవంత్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుస్మిత.. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా చేసినవి కాదని, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చేసినవేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రేవంత్రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోటీ చేయాలని సుస్మిత సవాల్ చేశారు. తన తల్లి రాజకీయంగా ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్రెడ్డిని శపిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరోసారి తీవ్ర దుమారం రేపాయి.
భూవివాదం నుంచి మొదలైన రాజకీయ దుమారం
ఈ వివాదానికి ప్రధాన కారణం సుస్మిత చేసిన ఆరోపణలే. రేవంత్రెడ్డి సోదరుడికి సంబంధించిన షెల్ కంపెనీకి విలువైన భూములను తక్కువ ధరకు కేటాయించారని ఆమె ఆరోపించారు. దీంతో కాంగ్రెస్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మరోవైపు టికెట్ల కేటాయింపులో నగదు ప్రమేయం ఉందంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని చర్యలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేస్తూ గవర్నర్కు సిఫార్సులు పంపారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని సురేఖ స్పష్టం చేసినా బర్తరఫ్ తప్పలేదు. ఇప్పుడు సుస్మిత చేసిన పరకాల సవాల్ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.
#KondaSurekha #KondaSusmitha #RevanthReddy #TelanganaPolitics #KondaSurekhaDismissal #Parkal #TelanganaCongress #CongressCrisis #TelanganaPoliticalNews #PoliticalControversy











