ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో కూడా చెప్పకుండా పంపించేశారని, అదే కసితో ఇప్పుడు అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బ్రూక్ఫీల్డ్, బ్లాక్స్టోన్, బ్లాక్రాక్, ఈపీటీ, టీపీజీ వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వెల్లడించారు.
ఉద్యోగాలు, హైకోర్టు బెంచ్పై హామీ
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్లో టాటా పవర్, సుజ్లాన్ సంస్థల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులతో సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని లోకేశ్ తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ 90 రోజుల్లో ఏర్పాటు కానుందని ప్రకటించారు. సోలార్ ప్రాజెక్టుల విషయంలో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ యూనిట్పై 13 పైసలు తగ్గించామని, రాష్ట్రాన్ని విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
చిన్నారుల కోరిక నెరవేర్చిన మంత్రి
ఆదోనికి చెందిన చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కంద తమను కలవాలని చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి లోకేశ్, ఇచ్చిన మాట ప్రకారం వారిని స్వయంగా కలిసి ఫొటో దిగారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకు స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధితో పాటు ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించడం కూడా ప్రభుత్వానికి ముఖ్యమని లోకేశ్ పేర్కొన్నారు.
#NaraLokesh #AndhraPradesh #APDevelopment #GlobalInvestors #InvestmentsInAP #JobCreation #20LakhJobs #ForeignInvestments #Brookfield #Blackstone #BlackRock #TPG #TataPower #Suzlon #RenewableEnergy #Kurnool #KurnoolDevelopment #HighCourtBench #APGovernment #AndhraPradeshPolitics #APNews #InvestmentNews #DevelopmentNews











