ప్రజల గడపలో ప్రభుత్వం,  హామీల అమలుపై ఆరా
ప్రజల్లోకి కూటమి కార్యక్రమం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రొద్దుటూరులో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ భగత్‌సింగ్ కాలనీలో టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కొండవీటి భావనాతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, సామాజిక పింఛన్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు సక్రమంగా అందుతోందా అనే అంశంపై ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ వారి స్పందనను నమోదు చేశారు.

హామీల అమలుపై ప్రజల స్పందన
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా? ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా? అనే అంశాలపై ప్రజలతో చర్చించారు. ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు బచ్చల ప్రతాప్, బీజేపీ నాయకుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, జనసేన నాయకుడు శివకుమార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
మహేష్ పోసా
ప్రొద్దుటూరు
+917337378783