విజయం సాధించినా.. పోరాటం ఆగదు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం తన తొలి లక్ష్యాన్ని సాధించింది. అయినా ఈ విజయాన్ని అంతిమ గమ్యంగా చూడడం లేదని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశాడు. “ఇది ముగింపు కాదు… ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం వెళ్లాలి” అంటూ విడుదల చేసిన వీడియో సందేశం కొత్త రాజకీయ, సామాజిక సంకేతాలను పంపింది. 37 రోజుల నిరవధిక పోరాటం, వేలాది మంది యువత మద్దతు, దేశవ్యాప్తంగా మారుమోగిన నినాదాల తర్వాత వచ్చిన విజయాన్ని ప్రజలకు అంకితం చేసిన దీప్కే, ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తనను విమర్శించిన వారిని కూడా గుర్తుచేసుకుంటూ, వారి ప్రశ్నలే తమను మరింత బలంగా మార్చాయని చెప్పాడు. నీట్ వ్యవస్థలో మార్పులతో మొదలైన ఈ ఉద్యమం ఇక ఒక్క అంశానికే పరిమితం కాదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెన్-జీ శక్తిని దేశ రాజకీయ చర్చలో నిలబెట్టిన సీజేపీ… ఇకపై ఎలాంటి అడుగులు వేయబోతోందన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది.
విజయం తర్వాత తొలి సందేశం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తొలి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 37 రోజుల ఉద్యమం విజయవంతంగా ముగిసినా, ఇది ముగింపు కాదని స్పష్టం చేశారు. “ఇది ఆరంభం మాత్రమే. కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకా చాలా దూరం ప్రయాణం ఉంది” అంటూ తన తదుపరి లక్ష్యాలపై సంకేతాలు ఇచ్చారు.
37 రోజుల పోరాటం కష్టమే
తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో అభిజీత్ దీప్కే ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు. గత 37 రోజులు ఎంతో కఠినంగా గడిచాయని చెప్పారు. ఇప్పుడు తొలిసారి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయానని పేర్కొన్నారు. “ఈరోజు ఏమి చేయాలి, సాయంత్రానికి ఏం జరుగుతుంది అనే ఆలోచన లేకుండా ఉదయం లేచాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది” అని వెల్లడించారు.
మద్దతుదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు
జంతర్ మంతర్లో 37 రోజుల పాటు ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా ఉద్యమం ముగిసిన రోజున అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయానని చెప్పారు. దేశం కోసం నిలబడ్డ ప్రతి యువకుడి త్యాగాన్ని తాను ఎప్పటికీ మరచిపోనని స్పష్టం చేశారు.

విమర్శకులకూ ధన్యవాదాలు
తనను విమర్శించిన వారికీ అభిజీత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సరైన విమర్శలు తనను మరింత మెరుగుపడేలా చేశాయని చెప్పారు. ఎదురైన ప్రశ్నలు, సూచనలు ఉద్యమాన్ని బలోపేతం చేశాయని వివరించారు. అందుకే ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగామని పేర్కొన్నారు.
జెన్-జీ శక్తికి కొత్త గుర్తింపు
భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు వ్యంగ్య స్పందనగా మే నెలలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్త యువజన ఉద్యమంగా మారింది. జంతర్ మంతర్లో వేలాది మంది విద్యార్థులు చేరి నీట్ పేపర్ లీక్ బాధితులకు న్యాయం కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రభుత్వం కీలక డిమాండ్లను అంగీకరించడంతో సీజేపీ ఉద్యమాన్ని విరమించింది. అయినా ఈ విజయాన్ని అంతిమ గమ్యంగా కాకుండా కొత్త ప్రయాణానికి తొలి అడుగుగా అభిజీత్ దీప్కే అభివర్ణించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.











