Home Naadesam_Special శృతి మించి రాగాన.. కూటమిలో కలహాల గానం!

శృతి మించి రాగాన.. కూటమిలో కలహాల గానం!


జనసేనకు బీజేపీ తోడు.. మిత్రధర్మంపై మంటలు.

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కనిపించిన ఐక్యతకు, ఇప్పుడు మిత్రపక్షాల నేతల నుంచి వినిపిస్తున్న మాటలకు పొంతన కనిపించడం లేదు. సమన్వయం, సమిష్టి నిర్ణయం, మిత్రధర్మం అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలూ టీడీపీకి దక్కేలా నిర్ణయం జరిగిందన్న ప్రచారం మిత్రపక్షాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దీనికి తోడు జనసేన నేతల వరుస వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్‌ “మా బలం ఏమిటో నిరూపించుకుంటాం” అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీయగా, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలు కూడా కూటమి అంతర్గత విభేదాలపై చర్చను పెంచాయి.

పొత్తు అంటే విధేయత కాదు

జనసేనకు సీట్లు తక్కువగా ఉండొచ్చు. టీడీపీ ప్రధాన భాగస్వామి కావొచ్చు. కానీ పొత్తు అంటే పెద్ద పార్టీ నిర్ణయాలు తీసుకోవడం, చిన్న పార్టీలు అనుసరించడం కాదన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో బలపడుతోంది. ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వెళ్లినప్పుడు పరస్పర గౌరవం, అధికార భాగస్వామ్యం, సంప్రదింపులు ఉంటాయని హామీ ఇచ్చాయి. ఇప్పుడు మిత్రపక్ష నేతల వ్యాఖ్యలకు టీడీపీ అనుకూల సోషల్‌ మీడియా వర్గాల నుంచి ఎదురుదాడి రావడం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోంది. రాజకీయ విభేదాలు నాయకుల స్థాయిలో ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ కార్యకర్తల స్థాయికి మాటల యుద్ధం చేరితే కూటమి పునాదులపైనే ప్రభావం పడే ప్రమాదం ఉంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనూ జనసేన, బీజేపీలో అసంతృప్తి ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. దీనిపై సంబంధిత పార్టీలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నాయకత్వానికి ఇదే అసలు పరీక్ష

బీజేపీకి రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాధాన్యం కావాలి. జనసేనకూ రాజకీయంగా తన బలం చూపించాలన్న ఆకాంక్ష ఉంది. నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు, భవిష్యత్‌ రాజకీయ ప్రాధాన్యం వంటి అంశాలు మిత్రపక్షాల మధ్య సున్నితంగా మారుతున్నాయి. ప్రతి విషయాన్నీ సంఖ్యాబలంతో నిర్ణయిస్తే పొత్తు కేవలం ఎన్నికల ఒప్పందంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వాలు వెంటనే అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు మిత్రపక్షాలతో సమన్వయం పెంచుకోవాలి. పవన్‌ కల్యాణ్‌ కూడా తన పార్టీ నేతలకు సంయమనం పాటించాలని సూచించాలి. బీజేపీ తన అభ్యంతరాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. బయట ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తయితే.. లోపల మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చడం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అసలు పరీక్ష. లేకపోతే శృతి మించిన ఈ రాజకీయ రాగం.. క్రమంగా కూటమి కలహాల గానంగా మారే అవకాశం ఉంది.

 

#APPolitics #AndhraPradesh #TDP #JanaSena #BJP #NDAAlliance #ChandrababuNaidu #PawanKalyan #NadendlaManohar #CoalitionGovernment #AlliancePolitics #PoliticalDisputes #GovernorQuotaMLC #MLCSeats #MithraDharma #AndhraPradeshPolitics #PoliticalNews #APNews #TDPJanaSenaBJP #JanaSenaBJP #TDPJanaSena #CoalitionPolitics #PoliticalHeat