రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (సవరణ) బిల్లు–2026పై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదైన అవినీతి కేసుల అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన, దేశంలో సత్వర న్యాయం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అమరావతిలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని కూడా కొనియాడారు. చట్టం ముందు సామాన్యుడైనా, అధికారంలో ఉన్న వ్యక్తైనా సమానమేనని పేర్కొంటూ, న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించినట్లేనని అన్నారు. ఇదే క్రమంలో 2013లో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు 13 ఏళ్లు గడిచినా ఇంకా తుది దశకు చేరకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
జగన్పై నమోదైన కేసుల విచారణ డిశ్చార్జ్ పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీలు వంటి కారణాలతో పదేపదే వాయిదా పడుతోందని చింతకాయల విజయ్ విమర్శించారు. ఎంతటి ప్రముఖులైనా చట్ట ప్రక్రియ ఒకే విధంగా అమలు కావాలని, కేసుల విచారణ వేగంగా పూర్తవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సుదీర్ఘ జాప్యాలు ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బిల్లుకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలని సూచించారు. అనంతరం స్పందించిన విజయ్, దేశ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులు, దిగువ కోర్టులు, ప్రత్యేక సీబీఐ కోర్టులను కూడా బలోపేతం చేసి వేగవంతమైన న్యాయాన్ని అందించాలని కోరారు.
#YSJagan #TDP #ChintakayalaVijay #RajyaSabha #SupremeCourt #JudicialReforms #CBICases #EDCases #AndhraPradeshPolitics #ChandrababuNaidu #APNews #PoliticalNews #IndianPolitics #JusticeSystem #LegalNews











